ఇరాన్ ఎంబసీ పోస్టు.. రాయబారికి యూకే సమన్లు

  • యుద్ధంలో శత్రువులకు తలొంచవద్దని ఇరాన్ పోస్టు
  • దేశాన్ని శత్రువులకు అప్పగించే బదులు ప్రాణాలు అర్పిద్దామని పిలుపు
  • ఇరాన్ ఎంబసీ చేసిన పోస్టు ఆందోళనకరమైనదనే అభిప్రాయాలు
  • రాయబారికి సమన్లు జారీ చేసిన యూకే ప్రభుత్వం
యూకేలోని ఇరాన్ రాయబార కార్యాలయం, ఆ దేశంలో నివసిస్తున్న ఇరానీయులను ఉద్దేశించి చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. ఇరానీయులు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని 'ఎక్స్' వేదికగా పోస్టు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో శత్రువులకు తలొంచవద్దని, దేశాన్ని వారికి అప్పగించే బదులు మనమంతా ప్రాణాలను అర్పిద్దామని యూకేలో నివసిస్తున్న తమ పౌరులకు పిలుపునిచ్చింది.

దేశంకోసం ఆత్మబలిదానానికి సిద్ధంగా ఉండాలని, అలాంటివారు తమను సంప్రదించాలని కోరింది. అయితే ఇరాన్ ఎంబసీ చేసిన పోస్టుపై విమర్శలు వస్తున్నాయి. ఇరాన్ ఎంబసీ చేసిన పోస్టు అనుచితమైనదని, ఆందోళనకరమైనదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇరాన్ దౌత్య కార్యాలయం చేసిన పోస్టు, ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని యూకే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పోస్టు చేసినందుకు ఆ దేశ రాయబారి సయ్యద్ అలీ మౌసావినికి సమన్లు జారీ చేశారు. అయితే ఇరాన్ రాయబార కార్యాలయం తమ పోస్టును సమర్థించుకోవడం గమనార్హం.

ఇది దేశభక్తికి, దేశంపై విధేయతకు సంబంధించినదని పేర్కొన్నారు. హింసను ప్రోత్సహిస్తున్నట్లు కాదని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరానీయులు ఎల్లప్పుడూ తమ మాతృభూమి పరిరక్షణకు ముందుంటారని తెలిపింది. యుద్ధంలో ప్రాణత్యాగానికి తనతో సహా ఇరాన్ పౌరులు సిద్ధంగా ఉండాలని ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Iran Embassy Urges Expats To Sacrifice Their Lives
Iran Embassy in UK

More Telugu News